శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పెరిగిన భక్తుల రద్దీ, భారీగా ట్రాఫిక్ జామ్!

శ్రీశైలం దేవస్థానంలో వార్షిక మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాంప్రదాయ ఆగమ శాస్త్ర ఆచారాల ప్రకారం ప్రారంభమయ్యాయి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది.

Published on: Feb 09, 2026 2:50 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఆ రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 16వ తేదీన మల్లిఖార్జునస్వామి, అమ్మవారి రథోత్సవం ఉంటుంది. 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

శ్రీశైలం
శ్రీశైలం

మరోవైపు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానాన్ని కలిపే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్‌లు కొనసాగుతున్నాయి. ఆదివారం నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనందున, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి కార్లలో తరలివచ్చారు. దీని ఫలితంగా శ్రీ సాక్షి గణపతి ఆలయం నుండి శ్రీశైలం ఆలయం వరకు ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయానికి కార్లు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. శివరాత్రి పండుగ నాటికి భక్తుల శాతం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. భక్తులకు అనవసరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

బహిరంగ ప్రదేశాలలో పైప్ పండళ్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, టాయిలెట్లను మరమ్మతు చేయడం, పాతాళగంగ స్నానపు ప్రదేశాలలో భద్రతా చర్యలు మెరుగుపరిచారు. అదనపు పార్కింగ్ ప్రాంతాలు, స్పష్టమైన సూచిక బోర్డులు, లగేజీ రూమ్‌లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల సౌలభ్యం కోసం 20 అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి అటవీ మార్గంలో వచ్చే భక్తులకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. నిజానికి 8వ తేదీ నుంచి అనుమతి ఇవ్వాలని మెుదట అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రగా వచ్చేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. భక్తుల ఇబ్బందులను గమనించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా మంది భక్తులు శ్రీశైలానికి అటవీ మార్గంలో బయలుదేరారు.