'అన్ని సేవలూ మనమిత్ర, ఆన్లైన్లోనే అందివ్వాలి.. అవేర్ వినియోగించుకోవాలి'
అన్ని సేవలూ మనమిత్ర, ఆన్లైన్లోనే అందివ్వాలని ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాటంనేని అన్నారు. అవేర్ను అన్ని శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
ప్రభుత్వంలోని ప్రతీ శాఖ ప్రజలకు అందించే అన్ని సేవలను తప్పనిసరిగా ఆన్లైన్లోనూ, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లోనే అందించాలని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో జరిగిన సదస్సులో ఆయన డేటా డ్రివన్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ కార్యకలాపాల గురించి వివరించారు.

వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా అందించాలనేది ముఖ్యమంత్రి ఆశయమని, దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామన్నారు భాస్కర్ కాటంనేని. అయితే ఇప్పటికీ కొన్ని శాఖలు మాన్యువల్గా సేవలందిస్తున్నాయని, ఇకపైన ప్రజలకు ప్రభుత్వ శాఖలు అందించే సేవలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మాత్రమే అందించాలని కోరారు. ఈ దిశగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్ వినియోగిత పెరిగేలా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని భాస్కర్ కాటంనేని కోరారు. డేటా అనుసంధానం ప్రక్రియ పూర్తైందని, దీనిద్వారా ఆయా శాఖలకు ఉపయోగపడేలా యూస్ కేసెస్ సిద్ధం చేస్తున్నామని ఏప్రిల్ నెలాఖరుకు ఈ యూస్ కేసెస్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారితంగా ఉపయోగపడే 98 యూస్ కేసెస్ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా శాఖలు తాము మరింత సులభంగా సరళతరంగా సేవలించడానికి వీలుగా ఎలాంటి యూస్ కేసెస్ కావాలని కోరుకుంటున్నారో తమకు తెలియజేయాలని ఇప్పటికే అడిగామన్నారు. ఆయా శాఖలు ఆ దిశగా తమ అవసరాలను తెలియజేస్తే ఇప్పుడు సిద్ధం చేస్తున్న యూస్ కేసెస్తో పాటు శాఖలు కోరిన విధంగా కూడా యూస్ కేసెస్ సిద్ధం చేసి ఇస్తామని తెలిపారు.
అవేర్తో ప్రయోజనాలు
రియల్ టైమ్లో వాతావరణం గురించి తెలుసుకోవడమే కాకుండా అనేక ప్రయోజనాలుండేలా ఆర్టీజీఎస్ అవేర్ విభాగం పనిచేస్తోందని భాస్కర్ కాటంనేని తెలిపారు. అవేర్ను అన్ని శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. అవేర్ ద్వారా విస్తృత ప్రయోజనాలు కలిగేలా 50 వరకు యూస్ కేసెస్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏ శాఖ అయినా ఈ విభాగాన్ని తమ అవసరాలకు తగ్గట్టు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

E-Paper












