Capital Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదల

Capital Amaravati : ఏపీ రాజధాని ఇక మీదట అమరావతి. చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రాజముద్ర వేశారు. ఇక అమరావతే రాజధానిగా కొనసాగుతుంది.

Published on: Apr 7, 2026, 08:43:32 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు లభించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఏపీకి రాజధానికి హోదా దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధమైన హోదా లభించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి

గత వారం పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, 2026కు ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి సంతకం చేశారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026, జూన్ 2, 2024న అమల్లోకి వచ్చినట్లుగా భావించాలి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014ను సవరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 5 (2) లో, 'ఒక కొత్త రాజధాని ఉంటుంది.' అనే పదాలను 'అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది.' అని మార్చారు.

సీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ అమరావతి కిందకు వస్తాయని చట్టంలో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం, 2014లోని నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కూడా చేర్చారు. ఈ మేరకు నోటిఫై చేసిన ప్రాంతాలన్ని అమరావతి కిందకు వస్తాయి. భవిష్యత్తులో వీటిలో ఏ మార్పు చేయాలన్నా.. పార్లమెంటు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ చేసే సవరణలకు చట్టబద్ధమైన వాల్యూ ఉండదు.

అమరావతిని అధికారికంగా అమరావతిగా ప్రకటిస్తూ, పార్లమెంట్ ఏప్రిల్ 2న సవరణ బిల్లుకు తుది ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఆమోదించిన ఒక రోజు తర్వాత, రాజ్యసభ మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించింది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని సమస్యపై తలెత్తిన అనిశ్చితికి, రాజకీయ నాయకుల వైఖరికి ఈ చట్టం ముగింపు పలికినట్టైంది. ఇది రాజధాని హోదాను మార్చడానికి లేదా పాత మూడు రాజధానుల నమూనాను పునరుద్ధరించడానికి భవిష్యత్తులో జరిగే ఏ ప్రయత్నాలనైనా చేయనివ్వదు.

రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన రైతుల ఆందోళనలను ఈ బిల్లు పరిష్కరించలేకపోయిందనే కారణంతో వైఎస్సార్‌సీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారంలో ఉన్నప్పుడు 2015లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేసేందుకు శంకుస్థాపన జరిగింది. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిలోని అన్ని ప్రాజెక్టులను నిలిపివేసి, మూడు రాజధానుల ఆలోచనను ప్రతిపాదించింది.

2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ పనులను గత సంవత్సరం తిరిగి ప్రారంభించారు.

అమరావతి బిల్లు చట్ట రూపం దాల్చడంతో రాజధాని ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కృతజ్ఞత తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More