ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. ఇదే మాదిరి నిర్ణయం ఏపీలో కూడా అమలు కానుందా..? అక్కడ తీసుకువచ్చిన సంస్కరణలను ఇక్కడ కూడా పరిశీలిస్తున్నారా..? అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. స్వయంగా ఈ విషయంపై దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించిందని లోకేశ్ గుర్తు చేశారు. ఇలాంటి సంస్కరణలను ఏపీలో కూడా అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. దావోస్లో బ్లూమ్బర్గ్తో మాట్లాడిన లోకేశ్… ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఒక రాష్ట్రంగా.. మేము కూడా ఆస్ట్రేలియా తీసుకువచ్చిన చట్టాన్ని అధ్యయనం చేస్తున్నాం. చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను" అని నారా లోకేష్ చెప్పారు.
‘‘ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉన్న యువకులు అలాంటి ప్లాట్ఫామ్లలో ఉండకూడదు. ఎందుకంటే వారు బహిర్గతం చేసే కంటెంట్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు.బలమైన, చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అవసరం కావొచ్చు. ఆ దిశగా మేం ఆలోచిస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లల కోసం టిక్ టాక్, ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్ మరియు థ్రెడ్స్ ను నిషేధించింది. డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సదరు కంపెనీలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు కనీసం 16 సంవత్సరాలు అని ధృవీకరించడానికి "సహేతుకమైన చర్యలు" తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై జరిమానాలు ఉంటాయి. కొన్ని ఫ్లాట్ ఫామ్స్ కు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయించారు.