AP Tourism : ఏపీ టూరిజంలో ఏఐ విప్లవం - దేశంలోనే తొలిసారిగా ‘నివు ఏఐ’ సేవలు షురూ..!

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్‌ప్లర్జర్ రూపొందించిన ‘నివు ఏఐ’ ప్లాట్‌ఫారమ్ వినియోగానికి మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.

Published on: Jul 8, 2026, 10:01:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ఒక చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ఏపీ టూరిజంలో ఏఐ విప్లవం
ఏపీ టూరిజంలో ఏఐ విప్లవం

వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రముఖ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్' రూపొందించిన ‘నివు ఏఐ’ (NiVU AI - Neural Intelligence Vernacular Unified Model) ప్లాట్‌ఫారమ్ వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ (APTA) మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలలో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్ పనితీరు ఆధారంగా భవిష్యత్తులో కాలపరిమితిని మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో, రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పూర్తి ఉచితం.. యాప్‌లతో పనిలేదు

ఈ సరికొత్త ఏఐ సాంకేతికత వల్ల పర్యాటకులకు ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని, ఇది పూర్తిగా ఉచిత సేవ అని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పర్యాటకులు తమ మొబైల్స్‌లో ఎలాంటి ప్రత్యేక అప్లికేషన్లను (Apps) డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పర్యాటక ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నేరుగా ‘నివు ఏఐ’తో మాట్లాడవచ్చు.

ఈ సందర్భంగా ‘ASK AI’ పేరుతో రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను మంత్రి ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్, సెక్రటరీ అజయ్ జైన్ స్వయంగా ఈ ఏఐ సాంకేతికతను మొబైల్ ద్వారా పరీక్షించి, మీడియా ప్రతినిధుల సమక్షంలో పర్యాటక ప్రాంతాల విశేషాలను తెలుసుకుని లైవ్ డెమో ప్రదర్శించారు.

ఈ సాంకేతికత ద్వారా పర్యాటకులు వాయిస్ (వ్యాఖ్య) లేదా టెక్స్ట్ (అక్షరాల) రూపంలో 130కు పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ భాషల్లో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, విశిష్టత మరియు ప్రాముఖ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీనితో పాటు, పర్యాటకుల ప్రాధాన్యతలు, వారి భాషలు, ప్రవర్తనా సరళిని విశ్లేషించి భవిష్యత్తు పర్యాటక ప్రణాళికలు రచించడానికి ఏపీటీఏకు ఈ ప్లాట్‌ఫారమ్ రియల్-టైమ్ అనలిటిక్స్ అందిస్తుంది.

మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్…

ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ముందే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలలో పైలట్ ప్రాజెక్ట్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. అక్కడ ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఈ ఏఐ సేవలను ఉపయోగించుకుంటూ, తమకు నచ్చిన భాషల్లో ఆలయ విశిష్టతను, పూజా విధానాలను తెలుసుకుని అద్భుతమైన స్పందన అందించారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

'స్వర్ణాంధ్ర విజన్-2047' లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయి అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. "స్థానిక తెలుగు భక్తుల నుండి అంతర్జాతీయ పర్యాటకుల వరకు ప్రతి ఒక్కరికీ మన సంస్కృతి, వారసత్వాన్ని వారి సొంత భాషలోనే వివరించే అద్భుతమైన సాంకేతికత ఇది. నేను స్వయంగా ఈ 'నివు ఏఐ'ని తెలుగులో పరీక్షించాను, ఇది ఎంతో ఖచ్చితత్వంతో, గౌరవపూర్వకంగా సమాధానాలు ఇస్తోంది," అని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాల్లో ఈ సాంకేతికత భక్తులకు అమితంగా ఉపయోగపడనుందని… గడిచిన రెండేళ్ల కాలంలో ఏపీ పర్యాటక రంగంలో తెచ్చిన వినూత్న సంస్కరణలను మెచ్చి ఇలాంటి గ్లోబల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ…. ఈ సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏఐ సాంకేతికత సామాన్యుడికి సైతం సులభంగా అర్థమయ్యేలా ఉందని చెప్పారు.

ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి మాట్లాడుతూ, "ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ వారసత్వపు లోతును, ప్రపంచ స్థాయి భారతీయ సాంకేతికతను ఒకచోటకు చేరుస్తుంది. రాబోయే మూడేళ్లలో ప్రతి సందర్శకుడి అనుభవాన్ని ఇది పూర్తిగా మార్చనుంది," అని అన్నారు. టెక్నాలజీకి ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వారే ఈ సంస్థను ఎంపిక చేశారని ఆమె వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More