రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2025-26 ఖరీఫ్ పంట కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు ఈనెల 27వ తేదీని ఖరారు చేసింది. ఈ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం… 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈసారి మాత్రం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమ్మిళితంగా పనిచేయడానికి… సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి నాదెండ్ల చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సమిష్టి కృషి చేయాలని మంత్రి నాదెండ్ల కోరారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు. రైతుల కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
48 గంటల్లో డబ్బులు జమ - మంత్రి నాదెండ్ల
మొత్తం 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 సహకార సంఘాల ద్వారా ధాన్యం సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 10,700 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.
1:2 విధానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటామని… 35 బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్మిల్లర్లకు సూచించారు. జిల్లాల్లో రియల్ టైమ్ మానిటరింగ్ అమలు చేస్తామని మనోహర్ తెలిపారు. తేమను కొలిచే యంత్రాలు, రవాణా సౌకర్యాలు మరియు నాణ్యమైన గోనె సంచుల సంసిద్ధతను ముందుగానే నిర్ధారించుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు వాట్సప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని హాయ్ అనే సందేశం పంపి నమోదు చేసుకోవచ్చుని కూడా సూచించారు.