గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు - ఏపీ ప్రభుత్వం ప్రకటన
గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 26, 2027వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు జరుగుతాయని దేవాదాయశాఖ పేర్కొంది.
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఈ తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజులపాటు ఈ పుష్కరాలు ఉంటాయని పేర్కొంది.
గోదావరి పుష్కరాలు – 2027
చాలా రోజుల తేదీల ఖరారపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ వచ్చింది. అయితే చివరగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం కీలకంగా నిలిచింది. పుష్కరాల ప్రవేశ–ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను ఎండోవ్మెంట్స్ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం…. తేదీలను ఖరారు చేసింది.
12 ఏళ్లకు ఓసారి…
గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం. బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో గోదావరి నదిలో స్నానం చేసుటను అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్షలాది భక్తులు నది తీరాలకు చేరుకుని స్నానాలు, దానాలు, పూజలు నిర్వహిస్తారు. పుష్కరాలు మొత్తం 12 రోజులు ఉంటాయి మరియు మొదటి రోజును పుష్కర ఆరంభం/అద్య పుష్కరం అంటారు.
రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం ఇప్పటికే చాలా రోజులుగా కసరత్తు కూడా చేస్తోంది. పనులు పురోగతిలో ఉన్నాయి.