మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీని కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మార్చి 31 వరకు ఛాన్స్…!

ఈ రాయితీ అవకాశం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న బకాయిలను చెల్లించేందుకు ముందుకొస్తే… వడ్డీపై రాయితీని పొందొచ్చు. ఇక ఇప్పటికే పలువురు వడ్డీతో పాటు పన్ను చెల్లించారు. అయితే వీరికి తదుపరి బిల్లులో మినహాయింపు ఇస్తామని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక అవకాశం ద్వారా చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. గతేడాది మార్చిలో కూడా ఏపీ ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ ప్రకటించింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈసారి కూడా చాలా మంది ఆస్తి పన్నుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని… పాత బకాయిలను క్లియర్ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 86 మున్సిపల్, కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీకాలం ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి నుంచి ప్రత్యేకాధికారుల పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు.. అప్పటి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరి పదవీకాలంలో మార్చి 17వ తేదీతో పూర్తవుతుంది.
కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు, మున్సిపాలిటీల్లో జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చూడనున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల సమస్యసలపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని… ప్రభుత్వం కూడా సూచించింది.