ఏపీ విద్యార్థులకు శుభవార్త - రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. రూ. 1,200 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తూ… ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు.
ఏపీ విద్యార్థులకు శుభవార్త
రాష్ట్రంలోని చాలా మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ బకాయిలు భారీగా పేరుకుపోవటంతో… కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. పరీక్షల సమయంలో హాల్ టికెట్ల జారీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు కోర్సు పూర్తైన తర్వాత కూడా సర్టిఫికేట్లు కూడా అందించడం లేదు. ఫీజు బకాయిలను చెల్లిస్తేనే సర్టిఫికెట్లను ఇస్తామని తేల్చి చెబుతున్నాయి.
విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం… గత కొంత కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పూర్తిగా క్లియర్ చేసేనట్లు అయింది.
ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం…. బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.736.01 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.98.92 కోట్లు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా రూ.365.07 కోట్లు విడుదల చేశారు. మొత్తం కలిపి రూ.1200 కోట్ల బకాయిలను క్లియర్ చేశారు. ఈ నిధులు నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమవుతాయి. పెండింగ్ బకాయిలను విడుదల చేయటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.