కొనుగోళ్లలో పత్తి రైతులకు ఇబ్బందులు - కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ
రాష్ట్రంలోని పత్తి రైతులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర చేనెత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా…. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని పేర్కొన్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ (CM APP) మరియు ఆధార్ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన విధానంలో నిర్వహిస్తున్నదని లేఖలో వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) ను రాష్ట్ర సీఎం యాప్ (CM APP) తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
లేఖలోని ముఖ్యమైన అంశాలు:
- కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) నుంచి సీఎం యాప్ (CM APP) కు రైతు వివరాలు రియల్ టైమ్లో సమన్వయం అయ్యేలా చేయండి.
- రైతులు తమ సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునే విధంగా మ్యాపింగ్ చేయాలని విజ్ఞప్తి.
- L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
- కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలి.
- వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ శాతం 12 నుండి 18 శాతం వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి.
- వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు తన లేఖలో ప్రస్తావించారు.
లేఖలో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రిని అచ్చెన్నాయుడు కోరారు. తద్వారా రైతులలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించవచ్చని… అంతేకాకుండా రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

