AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్
ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ వచ్చేసింది. నవంబరు 13 నుంచి 25 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. రూ.50 ఫైన్ తో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 అవకాశం ఉంటుంది. ఇక రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు చెల్లించవచ్చు.
ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల విభాగం విడుదల చేసి ప్రకటనలోని వివరాల ప్రకారం…. నవంబరు 13 నుంచి విద్యార్ధులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు గతంలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు కూడా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు.
ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్
ఫైన్ తో ఎప్పటివరకంటే…?
ఇక రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిన్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. వొకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆ వెంటనే షెడ్యూల్ కూడా విడుదలవుతుంది.