ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - ఈనెల 18 వరకు మాత్రమే ఆ ఛాన్స్!

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 18వ తేదీ వరకు కూడా ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు.

Published on: Dec 10, 2025 8:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షలను వచ్చే ఏడాదిలో నిర్వహిస్తారు. ఇందుకోసం ఎగ్జామ్ ఫీజులను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించిన అధికారులు… తాజాగా మరోసారి ప్రకటన చేశారు.

ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

డిసెంబర్ 18 చివరి తేదీ…

రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 12 వరకు పదో తరగతి విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చు. ఇక రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 18వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆ వెంటనే షెడ్యూల్ కూడా విడుదలవుతుంది.

తెలంగాణలో షెడ్యూల్ విడుదల:

మరోవైపు తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. మార్చి 14వ తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18వ తేదీన సెకెండ్‌ లాంగ్వేజ్‌, 23న ఇంగ్లీష్‌, 28న మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది.

ఏప్రిల్‌ 2వ తేదీన ఫిజిక్స్‌, ఏప్రిల్‌ 7న బయాలజీ, ఏప్రిల్‌ 13న సోషల్‌ స్టీడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 15న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-1 భాషా పీరీక్ష, ఏప్రిల్‌ 16న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-2 భాషా పరీక్షను నిర్వహిస్తారు.