APSSDC : ఏపీ నర్సులకు జర్మనీలో బంపర్ ఆఫర్.. 'ప్రాజెక్ట్ వసుధ' ద్వారా భారీ జీతంతో ఉద్యోగాలు

APSSDC : అర్హతగల నర్సులకు వృత్తి అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ప్రాజెక్ట్ వసుధ చేపట్టిన విషయం తెలిసిందే. దీని కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నర్సులు భాషా శిక్షణ, ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు.

Published on: Sep 17, 2026, 10:38:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైపుణ్యం కలిగిన నర్సులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్ వసుధ ఫలితాలను ఇస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద తొలి విడతలో ఎంపికైన ముగ్గురు నర్సులు జర్మనీలో భాషా శిక్షణ, ఉద్యోగ అవకాశాల కోసం విమానమెక్కారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

కాకినాడలోని ఆదిత్య నర్సింగ్ కళాశాలకు చెందిన నమిత, సనాయా సింగ్, శ్రీమాధురి కొర్ర అనే ముగ్గురు విద్యార్థినులు ఈ పథకం కింద మొదటి బ్యాచ్‌గా ఎంపికయ్యారు. జర్మనీ వెళ్లేముందు వీరికి రాజమహేంద్రవరంలో జర్మన్ భాషపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విదేశాలలో స్థ స్థానిక వాతావరణానికి, పని సంస్కృతికి అలవాటు పడేలా APSSDC ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందించింది.

జర్మనీ చేరుకున్న తర్వాత ఈ నర్సులు ఆరు నెలల పాటు B2-లెవల్ జర్మన్ భాషా శిక్షణ పొందుతారు. అలాగే అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ రికగ్నిషన్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. ఈ ఆరు నెలల శిక్షణా సమయంలో ప్రతి నెలా ఉచిత వసతి, ఆహారంతో పాటు సుమారు రూ. 1.20 లక్షలు స్టైపెండ్‌గా అందుకుంటారు.

భాషా శిక్షణ, గుర్తింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే నర్సులు ఉద్యోగంలో చేరతారు. అప్పుడు వారికి నెలకు సుమారు రూ. 3.40 లక్షలు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది.

ఈ సందర్భంగా APSSDC మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ జి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ జర్మనీ వెళ్లడం అనేది ఏపీలోని నైపుణ్యం కలిగిన నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలను సృష్టించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని కొనియాడారు.

ఈ కార్యక్రమాన్ని ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (OMCAP), స్కిల్ బీ ప్రైవేట్ లిమిటెడ్ (Skill Bee Pvt. Ltd.) భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, OMCAP జనరల్ మేనేజర్ డి. మనోహర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ జర్మన్ భాషా శిక్షణ, వృత్తిపరమైన గుర్తింపు, విదేశీ ఉద్యోగ మద్దతును కవర్ చేసే ఒక నిర్మాణాత్మకమైన మార్గాన్ని నర్సులకు అందిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం జర్మనీ దేశంలో ఆరోగ్య సంరక్షణ విభాగంలో నర్సింగ్ సిబ్బందికి భారీగా కొరత ఉంది. భారతీయ నర్సులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉపాధి పొందడానికి ఇది ఒక సువర్ణావకాశం. ప్రాజెక్ట్ వసుధ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాచ్‌ల ద్వారా వందలాది మంది నర్సులను విదేశాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే ఏపీ నర్సింగ్ అభ్యర్థులకు ఈ పథకం ఒక వరంగా మారనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More