పుస్తక ప్రియులకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ఇవాళ్టి నుంచి విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం(బుక్ ఫెయిర్) ప్రారంభం కానుంది. జనవరి 12వ తేదీతో ఈ బుక్ ఫెయిర్ కార్యక్రమం ముగుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
విజయవాడలో బుక్ ఫెయిర్ - ముఖ్యమైన వివరాలు:
- విజయవాడ సిటీలోని ఇందిరాగాంధీ నగరపాలక క్రీడాప్రాంగణంలో బుక్ ఫెయిర్ ఉంటుంది.
- బుక్ ఫెయిర్ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ పేరు పెట్టారు.
- ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ పేర్లను ఖరారు చేశారు.
- జనవరి 2వ తేదీ నుంచి జవవరి 12వ తేదీ వరకు ఈ బుక్ ఫెయిర్ అందుబాటులో ఉంటుంది.
- ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక శనివారం, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకే పుస్తక కేంద్రాలు తెరుస్తారు.
- ఈసారి మొత్తం 309 స్టాళ్లు ఏర్పాటవుతాయి.
- ప్రతి స్టాల్లోనూ10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఏ పుస్తకం కొనుగోలు చేసినా ఈ నిర్ణయం వర్తిస్తుంది.
- పుస్తక మహోత్సవంలో భాగంగా జనవరి 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. జనవరి 9వ తేదీన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు.

ప్రతి ఏడాది నిర్వహించబోయే ఎన్నో వైవిద్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు బుక్ఫెయిర్కు వస్తాయి. తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో, తెలుగు బుక్స్, సేజ్, పెంగ్విన్, నవయుగ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు అన్నీ ఒకే దగ్గర కనిపించనున్నాయి. విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాలతో బుక్ఫెయిర్ కొనసాగనుంది. ప్రతి ఏడాది జరిగే ఈ అతిపెద్ద పుస్తక మహోత్సవం కోసం పుస్తకప్రియులు ఎంతో ఆసక్తికగా ఎదురూచూస్తుంటారు. పుస్తకాలను కూడా భారీగానే విక్రయిస్తుంటారు. ఈసారి కూడా భారీగానే పుస్తకాలు కొనుగోలు కానున్నాయి.