ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 'జన్మభూమి ఎక్స్ప్రెస్' టైమింగ్స్ మార్పు, ఇవిగో వివరాలు
ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ మారనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తందని పేర్కొంది.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపింది. మార్పు చేసిన టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

టైమింగ్స్ మార్పు…
రైల్వేశాఖ నిర్ణయంతో విశాఖపట్నం - లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళలు మారనున్నాయి. విశాఖపట్నం-లింగంపల్లి (ట్రైన్ నెంబర్ 12806) రైలు విశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరనుంది. ఈ ట్రైన్ లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది.ఇక లింగంపల్లి-విశాఖపట్నం(ట్రైన్ నెంబర్ 12805) రైలు ఉదయం 6.55కు లింగంపల్లి నుంచి బయల్దేరుతుంది. రాత్రి 7.50కి విశాఖపట్నంకు చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు…
ఈ ట్రైన్ విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామల్ కోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నూజివీడు, విజయవాడ, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికుడ, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుంది.
క్రిస్మస్, కొత్త సంవత్సరం వేళ ప్రత్యేక రైళ్లు:
మరోవైపు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. క్రిస్మస్తోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.
చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య (ట్రైన్ నంబర్ 07196) స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈనెల 24 నుంచి జనవరి 30వ తేదీ వరకు బుధ, మంగళవారాల్లో రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
ఇక కాకినాడ నుంచి చర్లపల్లికి(07195) డిసెంబరు 28 నుంచి 31 వరకు ట్రైన్స్ నడుస్తాయి. ఆది, బుధవారాల్లో రాత్రి 7.50కి కాకినాడ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్స్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ,కైకలూరు, అకివీడు, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామల్ కోట్ల స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబరు 16 నుంచి డిసెంబర్ 30 వరకు తిరుపతి - చర్లపల్లి మధ్య ట్రైన్ నడవనుంది.ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఇక చర్లపల్లి-తిరుపతి ట్రైన్ (నం.07031) డిసెంబరు 19 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 3.35కి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, దోమకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.














