శబరిమలకు 140 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ఈ స్టేషన్లలో స్టాప్లు!
శబరిమల తీర్థయాత్ర సీజన్ నడుస్తోంది. పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మెుత్తం 140 రైళ్లు భక్తులకు సేవలు అందిస్తున్నాయి.
శబరిమల మండల-మకరవిళక్కు నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు వెళ్తున్నారు. మరోవైపు ఇండిగో విమానాలను రద్దు కావడంలాంటి కారణాలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సాయపడుతున్నాయి.

భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) దాదాపు 140 శబరిమల ప్రత్యేక రైళ్లను నడపుతోంది. వివిధ స్టేషన్లలో ఆగుతున్న ఈ ప్రత్యేక రైళ్లు మకర జ్యోతి దర్శనం వరకు నడుస్తాయి. ఇండిగో వివిధ విమానాశ్రయాల నుండి అనేక విమానాలను రద్దు చేయడంతో ఈ ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సహాయపడతాయని ఎస్సీఆర్ సీపీఆర్ఓ చెప్పారు.
ఈ ప్రత్యేక రైళ్లు సిర్పూర్ కాగజ్నగర్ నుండి కొల్లం, చర్లపల్లి నుండి కొల్లం, నర్సాపూర్ నుండి కొల్లం, ఇతర గమ్యస్థానాల నుండి కూడా పలు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అంతేకాకుండా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి వివిధ ప్రదేశాల నుండి అనేక ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేస్తోంది రైల్వే శాఖ.
ఈ ప్రత్యేక రైళ్లు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, పాలక్కాడ్ రోడ్, పాలకూరు, తిరుపూరు, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం, ఇతర స్టేషన్లలో ఆగుతాయని ది హిందూతో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ చెప్పారు.
సుమారు రెండు నెలలకు పైగా సాగే ఈ వార్షిక తీర్థయాత్ర జనవరి 20, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సీజన్ను దృష్టిలో ఉంచుకుని, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం.. సన్నిధానం, పంబ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసింది. ఈ పండుగ సీజన్లో ఆలయం ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. రోజువారీ పూజలు, దర్శనం కార్యక్రమాలు ‘హరివరాసనం’ పారాయణంతో ముగుస్తాయి.
డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించనున్నారు. ఆ రాత్రి ఆలయాన్ని మూసివేస్తారు. రెండు రోజుల విరామం తర్వాత, డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. జనవరి 14న మకరవిళక్కు వేడుకలు జరుగుతాయి. ఇందులో మాలికప్పురం వద్ద ఎళున్నెళిప్పు, పడి పూజ, కళభాభిషేకం, గురుతి పూజ వంటి ప్రధాన ఘట్టాలు ఉంటాయి. జనవరి 20వ తేదీ వరకు యాత్ర జరగనుంది.














