డిసెంబర్ 9న కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Published on: Dec 08, 2025 9:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని కలెక్టరేట్ సముదాయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఫొటోలతో కూడిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.

తెలంగాణ తల్లి
తెలంగాణ తల్లి

డిసెంబర్ 9, 2024న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మిగిలిన జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. జూలై 2025లో ప్రభుత్వం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో 12 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుసటి నెలలో శిల్పకళ కోసం టెండర్లను ఆహ్వానించింది. అన్ని విగ్రహాలు ఇప్పుడు పూర్తయ్యాయి, దీంతో ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃరూపకల్పన చేసింది. ఆకుపచ్చ చీర ధరించి, సాంప్రదాయ ఆభరణాలు అలంకరించిన, మధ్య వయస్కురాలైన మహిళ డిజైన్ రూపొందించారు. ఈ విగ్రహంలో తెలంగాణ తల్లి వరి, మొక్కజొన్న పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి దినోత్సవంగా కూడా ప్రకటించింది. దీనిని ఏటా జరుపుకోవాలని కూడా తెలిపింది.

మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం జనంలోకి తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. అయితే దీనిపై ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా గుర్తిస్తూ జీఓ నంబర్ 1946ను జారీ చేసింది.