పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణం - టీటీడీకి బీహార్ ప్రభుత్వం అనుమతి
బిహార్ రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించనున్నారు. 10.11 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మోకామా ఖాస్ ప్రాంతంలో ఈ స్థలాన్ని కేటాయించినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్ లేఖ రాశారు.
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంపై టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్… ఈ మేరకు టిటిడి ఛైర్మెన్ కు లేఖ రాశారు.
తిరుమల
సదరు స్థలంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాట్నాలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
ఈ భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తామని టిటిడి ఛైర్మెన్ తెలిపారు.
ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ తో టిటిడి ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి… టిటిడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బిహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.