తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. కొద్దిరోజులుగా క్రమంగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఓవైపు కోడిగుడ్ల ధరలు తగ్గుతుంటే మరోపక్క చికెన్ ధరలు ఊహించని విధంగా పెరిగింది

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో కేజీ చికెన్(స్కిన్ లెస్) ధర రూ. 340 నుంచి రూ. 350కి రూపాయలకు చేరింది. ఈస్థాయి మార్కును దాటడంతో సామాన్యులు చికెన్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఇదే ధరకు అర కిలో దాకా మటన్ వస్తుంది కాదా అని భావిస్తూ… వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇక స్కిన్ అయితే కేజీ ధర రూ. 320 వరకు పలుకుతోంది.
కారణాలేంటి..?
పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పైగా వేసవి కావటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో కోళ్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటి కారణాలతో మార్కెట్లో చికెన్కు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కిలో చికెన్ ధర రూ. 380 వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత కొనుగోళ్లపై హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కోళ్ల ఉత్పత్తి సరిగా లేదని… ఆశించిన స్థాయిలో సరఫరా కూడా జరగటం లేదని చెప్పారు. కిలో రూ. 350కి చేరటంతో వినియోగదారులు కొనుగోలు చేయటంలో వెనకడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే… ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.