రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు - సీఎం చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది.

మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలు..
విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. పీఎం కుసుమ్ సహా ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్నారు. ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఐస్(ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ) పాలసీ ద్వారా 60 రోజుల్లోనే తమ కార్యాచరణను ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఓ న్యూ ఎనర్జీ హబ్గా మారాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలకు, వాణిజ్యం, గృహ అవసరాలు, వ్యవసాయ రంగానికి జరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించాలని పేర్కొన్నారు.
వెయ్యి ఈవీ బస్సుల కొనుగోలు….
రాష్ట్రంలోని రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను జెన్కో ఇరిగేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పీఎస్పీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని అన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం సూచించారు. త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయం పై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు.













