...
...
Next Story

అమరావతి నాశనం అయినా ఫర్వాలేదనుకున్నారు.. కానీ శాసనం చేసుకున్నాం : చంద్రబాబు

Capital Amaravati : అమరావతి నాశనం చేయాలని వైసీపీ నేతలు అనుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ మనం శాసనం చేసుకున్నామని వ్యాఖ్యానించారు.

Updated on: Apr 3, 2026, 13:53:19 IST
Advertisement

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మద్దతు పలికాయన్నారు. ఈ రాష్ట్రంలో ఓట్లు పొంది, ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు మాత్రం రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

'అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తి స్థాయి చట్టబద్ధత వస్తుంది. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను రాజకీయ వైరుద్యాలు, వ్యక్తిగత బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు సహకారం ఇచ్చాయి. కానీ ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది.' అని చంద్రబాబు అన్నారు.

దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తాయని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్రం నాశనమైనా ఫర్వాలేదని పట్టుదలగా వ్యవహరించారన్నారు. అమరావతి నాశనం అయినా ఫర్వాలేదని అనుకున్నారు.. కానీ మనం శాసనం చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రాజముద్రతో 5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాయన్నారు.

అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని, విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ భావోద్వేగాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం సంపద సృష్టికి ఓ ప్రాంతం తయారు కావాలనే హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేశామన్నారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని ఆ రోజు చెప్పామని, చాలా అంశాలు పరిష్కారం కాకున్నా విభజన జరిగిందన్నారు.

'ఇవాళ హైదరాబాద్ లో ఇంతటి సంపద కలిగిందంటే సైబరాబాద్ లాంటి నగరాల నిర్మాణమే. చాలా మంది ఎంపీలు గుర్తించి పార్లమెంటులోనూ ఇది ప్రస్తావించారు. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను. రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం. ఒక ఎస్ఈ కార్యాలయంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని, బస్సులో బస చేసి కార్యకలాపాలు ప్రారంభించాం. ఏమీ లేకుండా రాష్ట్రం ఏర్పడిందనటానికి అవే ప్రత్యక్ష ఉదాహరణ.' అని చంద్రబాబు అన్నారు.

శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46 శాతం మంది ప్రజలు విజయవాడ- గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటుకు అనుకూలమని పేర్కొన్నారన్నారు. అయితే వైసీపీ చాలా డ్రామాలు ఆడిందని. అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఓ రాజధాని ఉండాలని మేం సంకల్పం చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.

ఆ సంకల్పంలో భాగమే మూడు ప్రాంతాలకు సమాన దూరంలో ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ప్రాంతంగా, కనెక్టివటీ పరంగా, భౌగోళికంగా, చారిత్రాత్మక ప్రదేశంగా రాజధానిగా ఎంపిక చేసి ప్రణాళికలు చేశామన్నారు.

'సింగపూర్ ఒక్క పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి మనకు ఇచ్చింది. అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములు ఇవి. పిలుపు ఇవ్వగానే 29 వేల మంది రైతులు 34 వేల ఎకకరాలను ఇచ్చారు. ప్రభుత్వ భూమి కూడా కలిపితే 54 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వాములను చేసేలా వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ను తీసుకువచ్చాం. తమ భవిష్యత్తు బాగుంటుందని రైతులకూ విశ్వాసం కలిగింది. జరీబు భూములు కలిగిన వారికి 450 కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ రిటర్నబుల్ ప్లాట్ లు ఇచ్చాం. ప్రతీ ఏటా యాన్యుటీ కూడా రైతులకు ఇస్తున్నాం. భూమిలేని రైతులకు కూడా పెన్షన్లు అదనంగా ఇస్తున్నాం.' అని చంద్రబాబు అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe