డిజి నెర్వ్ సెంటర్‌ ప్రారంభం.. నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

సంక్రాంతి పండుగ వేళ తన స్వగ్రామంతో పాటు తిరుపతిలో సీఎం చంద్రబాబు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. 

Published on: Jan 13, 2026 8:34 PM IST
By , Naravaripalle
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. గత ఏడాది కుప్పంలో పైలట్ గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవల్ని చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

అభివృద్ధి పనులకు శ్రీకారం
అభివృద్ధి పనులకు శ్రీకారం

ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లెకు వెళ్లిన సీఎం ఇవాళ స్వగ్రామం సహా తిరుపతిలలో వేర్వేరు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

నారావారిపల్లెలో రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే స్వగ్రామంలో యువత నైపుణ్యాలు పెంచేలా రూ.1.4 కోట్ల తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దీంతో పాటు రూ.77 లక్షలతో ఎ.రంగంపేట - భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకూ నిర్మించిన నూతన రహదారిని కూడా సీఎం ప్రారంభించారు.

30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో రూ.45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమినిటీస్ కాంప్లెక్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ లో రూ.7.5 కోట్లతో నిర్మించిన యూత్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్ ను సీఎం ప్రారంభోత్సవం చేశారు.

నీటి తరలింపు ప్రాజెక్టుకు శంకుస్థాపన….

నారావారిపల్లె సమీపంలో రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్ కు, మూలపల్లి చెరువు సహా మరో 4 చెరువులకు నీటిని తరలించే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న పశువుల వసతి నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5.03 కోట్లతో అకడెమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు నిర్మాణానికి, రూ.2.91 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.