కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలోని మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది.

Published on: Nov 2, 2025, 16:41:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో ఒక బాలుడు, 8 మంది మహిళలు ఉన్నారు. 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కార్తీక ఏకాదశి సందర్భంగా దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షలు, అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

తొక్కిసలాట జరిగి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తాజాగా పరిహారం అందజేసింది. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు.

తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రధాని మోదీ కూడా రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయం త్వరలో అందుతుందని రామ్మోహన్‌నాయుడు చెప్పారు. దైర్యంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు.

తొక్కిసలాట ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ చర్యలు ప్రజాస్వామ్య విలువలు, మానవత్వానికి విరుద్ధమన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబాలపై వైసీపీ అనవసర ప్రచారాలు చేయడం దారుణం అని అన్నారు.

తొక్కిసలాట ఘటన స్థలాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More