...
...
Next Story

PSLV C62 : 'అన్వేషన్' శాటిలైట్ ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఇది చాలా కీలకం ఎందుకంటే?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ మెుదలైంది.

Updated on: Jan 11, 2026 05:12 PM IST
Advertisement

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAR)లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మధ్యాహ్నం 12:17 గంటలకు మెుదలైంది. మొత్తం 22 గంటల పాటు కొనసాగుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు PSLV-C62 రాకెట్ ఉపయోగించి 'అన్వేషణ్' అని నామకరణం చేసిన EOS N1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

PSLV-C62 రాకెట్ కౌంట్‌డౌన్
PSLV-C62 రాకెట్ కౌంట్‌డౌన్

ఈ మిషన్ ద్వారా ఎనిమిది విదేశీ, ఏడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. 'అన్వేషణ్' ఉపగ్రహం భూమి పరిశీలన కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. రక్షణ రంగానికి అవసరమైన డేటాను అందించడం, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందస్తు హెచ్చరికలను అందించడం ద్వారా జాతీయ భద్రత, విపత్తు నిర్వహణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

సకాలంలో సమాచారం అందించడం వల్ల ఇటువంటి సంఘటనల సమయంలో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇస్రో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 12న ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి PSLV-C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు వీక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ప్రయోగానికి ముందుగానే షార్, దాని చుట్టుపక్కల విస్తృత భద్రతా చర్యలు అమలు చేశారు. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియ ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. PSLV-C62 ద్వారా EOS N1 (అన్వేషణ్) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష కార్యక్రమానికి గర్వకారణంగా అని చెబుతున్నారు. ఇది జాతీయ రక్షణ, వాతావరణ అధ్యయనాలు, విపత్తు నిర్వహణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe