ఇస్రో రికార్డు: 6,000 కిలోల అమెరికా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఎల్వీఎం3-ఎం6
క్రిస్మస్ వేళ ఇస్రో చరిత్ర సృష్టించింది. 6,100 కిలోల బరువున్న అమెరికా కమ్యూనికేషన్ శాటిలైట్ ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ను తన అత్యంత శక్తివంతమైన ‘బాహుబలి’ (LVM3) రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
శ్రీహరికోట నుంచి ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తన అత్యంత శక్తివంతమైన 'బాహుబలి' రాకెట్ (LVM3-M6) ద్వారా బుధవారం ఉదయం అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. భారత్ గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.

దేశానికి క్రిస్మస్ కానుక..
శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 8:55 గంటలకు ఎల్వీఎం3-ఎం6 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 15 నిమిషాల ప్రయాణం తర్వాత, 6,100 కిలోల బరువున్న 'బ్లూబర్డ్ బ్లాక్-2' ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయంపై ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ హర్షం వ్యక్తం చేస్తూ.. "బాహుబలి రాకెట్ తన సత్తా చాటింది. ఇది దేశానికి మేమిస్తున్న క్రిస్మస్, నూతన సంవత్సర కానుక" అని పేర్కొన్నారు.
డైరెక్ట్-టు-మొబైల్ విప్లవం
అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్మొబైల్ (AST SpaceMobile) కోసం ఇస్రో వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (NSIL) ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ 'బ్లూబర్డ్' ఉపగ్రహం ప్రత్యేకత ఏంటంటే.. ఇది నేరుగా స్మార్ట్ఫోన్లకే 4G, 5G సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది. అంటే టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, డేటా స్ట్రీమింగ్ సజావుగా సాగిపోయేలా ఇది తోడ్పడుతుంది.
రికార్డుల మీద రికార్డులు
ఇప్పటివరకు భారత గడ్డ నుంచి ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత బరువైన ఉపగ్రహం. గతంలో నవంబర్ 2న ప్రయోగించిన 4,400 కిలోల ఉపగ్రహమే అత్యంత బరువైనదిగా ఉండేది. ఆ రికార్డును ఇప్పుడు 6,100 కిలోలతో బ్లూబర్డ్ అధిగమించింది.
ఖచ్చితత్వం: 520 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 518.5 కిలోమీటర్ల వద్ద అత్యంత ఖచ్చితత్వంతో దీన్ని ప్రవేశపెట్టారు.
వరుస విజయాలు: ఎల్వీఎం3 రాకెట్కు ఇది వరుసగా ఎనిమిదో విజయం. చంద్రయాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాల్లోనూ ఇదే రాకెట్ కీలక పాత్ర పోషించింది.
విదేశీ ఉపగ్రహాలు: ఈ ప్రయోగంతో భారత్ ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లయింది.
ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్, సీఎం చంద్రబాబు, జగన్ అభినందనలు
అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం 'బ్లూబర్డ్ బ్లాక్-2'ను ఇస్రో తన అత్యంత శక్తివంతమైన ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.
కొత్త మైలురాయిని చేరుకున్నాం:
గవర్నర్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "తదుపరి తరం కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఈ ఎల్వీఎం3 మిషన్, దేశానికి సరికొత్త మైలురాయిని అందించింది. ఇస్రో కీర్తి కిరీటంలో ఇది మరో కలికితురాయి" అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రపంచ విశ్వసనీయ భాగస్వామిగా భారత్: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. "శ్రీహరికోట నుంచి ఎల్వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం కావడం గర్వకారణం. ఈ విజయం భారతదేశ వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమ్మదగ్గ అంతరిక్ష భాగస్వామిగా భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది" అని ఆయన కొనియాడారు. ఈ విజయం వెనుక ఉన్న ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కృషిని ఆయన అభినందించారు.
శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం: వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇస్రో బృందాన్ని ప్రశంసించారు. "నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేర్చడం భారతదేశానికి గర్వకారణం. ఇది మన శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా సెల్యూట్" అని ఆయన ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


