233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై మెుంథా తుపాను ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Published on: Oct 28, 2025, 12:22:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో మెుంథా తుపాను ప్రభావం గట్టిగా ఉంది. కోస్తా జిల్లాలోపాటుగా ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుపాను ప్రభావం చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెుంథా తుపాను ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. చెట్లు విరిగిపడుతున్నాయి. సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. విజయవాడలో ఐఎండీ హెచ్చరించినట్టుగా కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. నగరంలో 16.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్ల నుంచి ప్రజలకు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. విజయవాడ నగరపాల సంస్థ పరిధిలో 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విశాఖ, అనకాపల్లిలోనూ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఇక్కడ వర్షం పడుతుంది. రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. తీర ప్రాంతంలో అక్టోబర్ 29వ తేదీ ఉదయం వరకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.


లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పట్టణాల్లో ట్రాఫిక్ జామ్స్ ఉంటాయని వెల్లడించింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచన చేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెుంథా తుపాను ఎదుర్కోవడానికి అధికారులను సిద్ధం చేసింది. ప్రజలకు సహాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 558 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక రాష్ట్ర స్థాయి, 19 జిల్లా, 54 డివిజనల్, 484 మండల/గ్రామ స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఉన్నాయి. ఇవన్నీ అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి 24x7 పనిచేస్తాయి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం16 శాటిలైట్ ఫోన్‌లు, 35 డీఎంఆర్ సెట్‌లు కూడా జిల్లాలకు పంపిణీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,194 సహాయ శిబిరాలను సిద్ధం చేశారు. 3,465 మంది గర్భిణీ, పాలిచ్చే మహిళలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సహాయ, రక్షణ కార్యకలాపాల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఎక్కువగా ప్రభావితమయ్యే జిల్లాల్లో మోహరించారు. అదనపు బృందాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఎన్టీఆర్ జిల్లాలో, కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు(ఫోన్: 9154970454). రెవెన్యూ, ఆరోగ్యం, అగ్నిమాపక, జలవనరులు, రోడ్లు మరియు భవనాలు, వ్యవసాయం, ఇంధన శాఖల అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. ఏపీ విపత్తుల నిర్వహమ సంస్థ కంట్రోల్ రూమ్‌ నెంబర్లు 112, 1070, 1800 425 0101గా ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More