జనవరి 2 నుంచి టోకెన్లు లేకుండా వచ్చినా దర్శనానికి అనుమతి : టీటీడీ

టోకెన్లు లేకుంటే తిరుమలకు రానివ్వరని దుష్ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలు నమ్మవద్దని కోరారు.

Published on: Dec 23, 2025, 17:49:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే చాలాసార్లు సమావేశాలు నిర్వహించి కీలక విషయాలు ప్రకటించింది. తాజాగా మంత్రులు కూడా టీటీడీతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. మరోవైపు తిరుమల దర్శనంపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.

టీటీడీ
టీటీడీ

టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వారికి అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టతనిచ్చారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టోకెన్లు లేకుంటే తిరుమలకు రానివ్వరని దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మకూడదని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పారు. టిక్కెట్లు లేని భక్తులు జనవరి 2వ తేదీ నుండి సర్వ దర్శనం క్యూలలో చేరవచ్చన్నారు. టోకెన్లు లేకున్నా జనవరి 2 నుంచి దర్శనానికి అనుమతిస్తామని క్లారిటీ ఇచ్చారు.

వైకుంఠ ఏకాదశికి టీటీడీ అనుబంధ‌ ఆలయాలలో ఏర్పాట్లు

డిసెంబ‌రు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ అనుబంధ‌ ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించ‌నున్నారు.

ఒంటిమిట్ట

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున 1.35 గంట‌లకు ఉత్తర ద్వారా ద‌ర్శనం క‌ల్పించ‌నున్నారు. ఉదయం 8.30 గంట‌ల‌కు స్వామివారు గ‌రుడ‌వాహ‌నంపై విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్రహించ‌నున్నారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అధ్యయ‌నోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

నంద‌లూరు

నంద‌లూరు శ్రీ సౌమ్యనాథ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్లవారుజామున 1.35 గంట‌లకు ఉత్తర ద్వారా ద‌ర్శనం, ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌క్ష తుల‌సీ అర్చన‌ నిర్వహించ‌నున్నారు. డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 9 గంట‌ల‌కు గ్రామోత్సవం ఉంటుంది.

దేవుని క‌డ‌ప

దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్లవారుజామున 1.35 గంట‌లకు ఉత్తర ద్వారా ద‌ర్శనం క‌ల్పించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్రస్నాం ఉంటుంది.

జమ్మలమడుగు

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్లవారుజామున 1.35 గంట‌లకు భ‌క్తుల‌కు ఉత్తర ద్వారా ద‌ర్శనం క‌ల్పిస్తారు.

అదేవిధంగా అన్నమ‌య్య జిల్లా తాళ్లపాక‌లోని శ్రీ చెన్నకేశ‌వ‌స్వామివారి ఆల‌యం, రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఉన్న శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More