...
...
Next Story

ఏపీలో భిన్నమైన వాతావరణం.. 3 రోజులు ఎండలు, ఉరుములు, వర్షాలు.. 107 మండలాల్లో హీట్‌వేవ్!

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉన్నాయి. ఇలాగే మరో మూడు రోజులు ఉండనుంది.

Published on: Jun 6, 2026, 07:38:41 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న భిన్నమైన వాతావరణం (ఎండలు, వడగాల్పులు, ఉరుములు, వర్షాలు) మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం

పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చు.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగుల కింద ఆశ్రయం పొందకూడదు. ఆకాశం మేఘావృతమై, ఉరుములు వినిపించిన వెంటనే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఈదురు గాలుల వల్ల కిందపడిపోయిన విద్యుత్ తీగలను గమనిస్తూ, వాటికి దూరంగా ఉండాలి.

107 మండలాల్లో వడగాల్పుల తీవ్రత

శనివారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 107 మండలాలపై వడగాల్పుల ప్రభావం ఉండనుంది. ఇందులో 56 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 51 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

తీవ్ర వడగాల్పులు వీచే జిల్లాలు

  • విజయనగరం (20 మండలాలు)
  • పార్వతీపురం మన్యం (14 మండలాలు)
  • శ్రీకాకుళం (11 మండలాలు)
  • కాకినాడ (8 మండలాలు)
  • పోలవరం (2 మండలాలు)
  • అల్లూరి సీతారామరాజు (1 మండలం)

ఉష్ణోగ్రతల అంచనా

42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో నమోదయ్యే అవకాశం ఉంది. 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నమోదవచ్చు.

శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇవే

  • నెల్లూరు జిల్లా గూడూరు: 44.6 డిగ్రీలు (రాష్ట్రంలోనే అత్యధికం)
  • పశ్చిమ గోదావరి జిల్లా తణుకు: 43.7 డిగ్రీలు
  • పల్నాడు జిల్లా పిడుగురాళ్ల: 43.3 డిగ్రీలు
  • కృష్ణా జిల్లా కానుమోలు, సాలూరు: 43.1 డిగ్రీలు
  • ప్రకాశం జిల్లా కారేడు: 43 డిగ్రీలు
  • విజయనగరం జిల్లా రాజాం: 42.7 డిగ్రీలు
  • అనకాపల్లి జిల్లా రాజాం: 42.6 డిగ్రీలు
  • బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, ఏలూరు జిల్లా నారాయణపురం, తిరుపతి జిల్లా పూలతోట: 42.3 డిగ్రీలు

అమరావతి వాతావరణ కేంద్రం (IMD) అంచనా ప్రకారం.. రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత క్రమంగా తగ్గి.. పలు ప్రాంతాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe