Special Intensive Revision in AP : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 58.12 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాంల పంపిణీ పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ ప్రకటించారు.
గణాంకాలు ఇలా…

క్షేత్రస్థాయిలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 2,41,93,304 మంది ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్యూమరేషన్ ఫాంలను సిబ్బంది అందజేశారు. ఓటర్ల వివరాల నమోదు, తప్పుల సవరణ ప్రక్రియను మరింత పక్కాగా నిర్వహించేందుకు ఈ ఫారాల పంపిణీ ఎంతో కీలకంగా మారింది.
కేవలం ఫారాలు పంపిణీ చేయడమే కాకుండా….. వాటి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ రికార్డుల్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు అందిన ఫారాల్లో 8,45,108 ఫాంలను విజయవంతంగా డిజిటలైజ్ చేసినట్లు వివేక్ యాదవ్ వివరించారు. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో 2.03 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను కంప్యూటరీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు ఈ సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరోవైపు ఓటర్లకు ఎన్నికల సంఘం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ వివరాలను స్వయంగా ధృవీకరించుకోవచ్చని పేర్కొంది. గతంలో లాగా ఓటర్ ఐడీలో మార్పులు చేర్పులు చేయడం కోసం లేదా వివరాల నమోదు కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక లేదు. అధికారులు మీ ఇంటికి వచ్చేవరకు వేచి చూడాల్సిన పని అంతకన్నా లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ సహాయంతో ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు.
ఆన్లైన్లో వివరాలు నమోదు ప్రాసెస్:
- మొదట ఓటర్లు భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in ను సందర్శించాలి.
- అక్కడ మీ ఓటర్ ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్ (EPIC) నంబర్ను నమోదు చేయాలి.
- మీ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత మీ పాత రికార్డులతో ప్రస్తుత వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
- చివరగా మీ ఆధార్ ఈ-సైన్ (eSign) ద్వారా అత్యంత సురక్షితంగా ఈ ఫారమ్ను సబ్మిట్ చేయవచ్చు.
ఈ సరికొత్త ఆన్లైన్ విధానం ఓటర్లకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుందని… ఇది అత్యంత సులభం, సురక్షితం, వేగవంతమైన ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
{{/usCountry}}ఈ సరికొత్త ఆన్లైన్ విధానం ఓటర్లకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుందని… ఇది అత్యంత సులభం, సురక్షితం, వేగవంతమైన ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
{{/usCountry}}