SIR in AP : ఏపీలో ఓటర్ల జాబితా సవరణ షురూ - మొదటి రోజే 4 లక్షల నమోదు ఫామ్స్ పంపిణీ!

Andhra Pradesh Voter List Revision : ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల పాటు సాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే 4 లక్షలకు పైగా ఓటర్ల నమోదు ఫారాలను పంపిణీ చేసినట్లు సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు.

Published on: Jun 16, 2026, 05:12:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Andhra Pradesh Voter List Revision : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియ షురూ అయింది. ఈ నెల రోజుల పాటు సాగే ప్రత్యేక కార్యక్రమం సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ ప్రకటించారు. ఈ ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియ వచ్చే నెల జూలై 14 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ షురూ
ఏపీలో ఓటర్ల జాబితా సవరణ షురూ

ఈ సవరణ ప్రక్రియలో భాగంగా 2026 మే 25 నాటికి ఓటర్ల జాబితాలో నమోదైన ప్రతి ఓటరుకు, వారి వివరాలు పాక్షికంగా ముందే నింపిన ఓటర్ల నమోదు ఫారం (Enumeration Form - EF) అందుతుందని సీఈఓ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

మొదటి రోజే భారీ స్పందన

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజే ఈ ప్రక్రియకు విశేష స్పందన లభించింది. కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజే క్షేత్రస్థాయిలో ఓటర్లకు 4.12 లక్షలకు పైగా నమోదు ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. వీటిలో సమాచారాన్ని సేకరించి, 4,115 ఫారాలను ఇప్పటికే డిజిటలైజ్ కూడా చేసినట్లు వివేక్ యాదవ్ వివరించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈ ఫారాల ప్రింటింగ్ 100 శాతం పూర్తయిందని, పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రెండేళ్ల తర్వాత ఎన్నికల సంఘం మళ్లీ ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2026 జూలై 1వ తేదీని అర్హత గల తేదీగా (Qualifying Date) పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు 4.16 కోట్ల మంది ఓటర్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.

ఈ భారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున సిబ్బందిని రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs), 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs), 175 మంది నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs), 1,076 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) మరియు 28 మంది జిల్లా ఎన్నికల అధికారులు (DEOs) ఈ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

మీ ఇంటికే బూత్ స్థాయి అధికారులు

ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటర్ల నమోదు ఫారాల (EFs) పంపిణీ, వాటిని తిరిగి సేకరించేందుకు ఈ పర్యటనలు చేస్తారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లు తమ పేరును, అలాగే తమ కుటుంబ సభ్యుల పేర్లను సరిచూసుకుని, ఈ నమోదు ఫారంలో వివరాలను భర్తీ చేయాలని సీఈఓ సూచించారు.

ఓటర్లకు సహాయం అందించేందుకు సాంకేతికతను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓటర్లు తమ బూత్ స్థాయి అధికారితో మాట్లాడటానికి 'ECINet' యాప్‌లో ఉన్న 'Book-a-Call with BLO' సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా అవసరమైన సహాయం పొందవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More