నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి?

Telangana Delimitation Assembly seats : డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. అయితే ఎన్ని సీట్లు కొత్తగా పెరుగుతాయనే చర్చ ఇప్పుడు మెుదలైంది.

Published on: Apr 15, 2026 9:20 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నియోజకవర్గాల పునర్విభజన గురించి దేశం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 60 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో అదనంగా చేరతాయని అంచనా. తద్వారా మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119 నుండి సుమారు 179కి పెంచే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ స్థానాలు
తెలంగాణ అసెంబ్లీ స్థానాలు

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించవచ్చినప్పటికీ.. అసెంబ్లీ స్థానాల కేటాయింపులో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి అసెంబ్లీ స్థానాల సంఖ్య 29 నుండి 45కి పెరుగుతుంది. ఇందులో హైదరాబాద్‌కు 20 స్థానాలు, మేడ్చల్-మల్కాజిగిరికి 13, రంగారెడ్డికి 12 స్థానాలు దక్కుతాయి. నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఎనిమిది స్థానాల చొప్పున వచ్చే అవకాశం ఉంది.

జనాభా ఒక్కటే నియోజకవర్గాల పునర్విభజనకు ప్రామాణికమని, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు అటుఇటుగా సమాన జనాభా ఉండేలా ప్లాన్ చేస్తారు.

తెలంగాణ 3.50 కోట్ల జనాభాలో 54.08 లక్షల మంది ఎస్సీలు, 31.77 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగా ఎస్సీ స్థానాల సంఖ్య 19 నుండి 28కి, ఎస్టీ స్థానాల సంఖ్య 12 నుండి 16కి పెరుగుతుంది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, ములుగు, నారాయణపేట వంటి కొన్ని జిల్లాలను మినహాయిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరుగుతుంది.

మహిళల రిజర్వేషన్ల విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 15 రిజర్వ్ స్థానాలను కలిగి ఉంటాయి. 2014లో విభజన సమయంలో డీలిమిటేషన్ జరిగి ఉంటే.. తెలంగాణకు 34 సీట్లు అదనంగా లభించి ఉండేవని కొందరి వాదన. 2027 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం కేవలం 2011 గణాంకాలపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని గణనీయంగా మారుస్తుంది.

ఇక దేశంలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం కొత్తగా 'నియోజకవర్గాల పునర్విభజన కమిషన్'ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి 42 స్థానాల నుంచి 59కి పెరిగనున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More