Kurnool Jaahnavi Kandula : అయ్యో… ఎంత విషాదం..! జాహ్నవి కందుల తండ్రి గుండెపోటుతో మృతి, పరిహారం రాకముందే..!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాహ్నవి కందుల ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలనే జాహ్నవికి 29 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేందుకు సియాటెల్ టౌన్ సిద్ధమైన సంగతి తెలిసిందే.
అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో తెలుగు విద్యార్థి జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఆమె కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాహ్నవి కుటుంబం న్యాయపోరాటం చేస్తుండగా…. సెటిల్మెంట్ కోసం సియాటెల్ సిటీ ముందుకు వచ్చింది. 29 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. భారత్ కరెన్సీలో చూస్తే సమారు రూ.262 కోట్ల రూపాయలు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ నుంచి ప్రకటన విడుదలైంది.

అప్పట్నుంచి న్యాయపోరాటం…
కుమార్తె మృతికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ జాహ్నవి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు 2023 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే జాహ్నవి కుటుంబంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. కుమార్తె మృతిని తట్టుకోలేక… చాలా రోజులుగా మానసికంగా ఇబ్బందిపడుతున్న తండ్రి శ్రీకాంత్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జాహ్నవి కుటుంబం మరింత విషాదంలోకి వెళ్లింది.
జాహ్నవి తండ్రి శ్రీకాంత్… హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. జాహ్నవి మరణం తర్వాత ఆయన మానసికంగా పూర్తిగా కుంగిపోయారు. లాంగ్ లీవ్ తీసుకున్నారు. అప్పట్నుంచి కుమార్తె మరణంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగానే అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ రావడంతో మళ్లీ విధుల్లో చేరేందుకు వెళ్లారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తుండగా శ్రీకాంత్కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వైద్య సాయం అందేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
జాహ్నవికి న్యాయం కోసం చివరి వరకు నిలబడ్డ తండ్రి శ్రీకాంత్ మృతి చెందటంతో ఆ కుటుంబంలో కన్నీరుమున్నీరవుతోంది. ఇటీవలే ప్రకటించిన పరిహారం కూడా వారి వరకు రాకుండానే ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదంగా మారింది. శ్రీకాంత్ అంత్యక్రియలను బుధవారం ఆధోనీలో పూర్తి చేసినట్లు బంధువులు తెలిపారు.
జాహ్నవి కందుల 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సియాటెల్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. 2023 జనవరి 23 రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో ఫుటేజీ కూడా బయటికి వచ్చింది. పోలీసు అధికారి కెవిన్ డేవ్ ఓవర్ స్పీడ్తో వాహనం నడపడినట్లు తేలింది. అంతేకాకుండా ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆ పుటేజీ ద్వారా బయటపడింది.
సాధారణ వ్యక్తి మరణించిందని, ప్రాణానికి విలువ లేదని ఆఫీసర్ కెవిన్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డు అయింది. తర్వాత ఈ ఆడియో రికార్డింగ్ బయటపడిన తర్వాత నిరసనలను రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ దర్యాప్తు కూడా కోరింది.

E-Paper












