అమెరికాలో తెలుగు విద్యార్థి జాహ్నవి కందుల మృతి కేసు.. ఫ్యామిలీకి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో తెలుగు విద్యార్థి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సియాటెల్ సిటీ సెటిల్మెంట్ కోసం వచ్చింది.
యూఎస్లో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో జాహ్నవి కందుల అనే తెలుగు అమ్మాయి మృతిచెందింది. అంతేకాదు ఈ సమయంలో పోలీస్ అధికారి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలంగా మారాయి. భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా సియాటెల్ సిటీ సెటిల్మెంట్ కోసం వచ్చింది. 29 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ కరెన్సీలో చూస్తే సమారు రూ.262 కోట్ల రూపాయలు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ నుంచి ప్రకటన విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్లేక్ యూనియన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. జనవరి 2023లో ఆమె రోడ్డు దాటుతూ ఉండగా.. వేగంగా కారు నడుపుతూ వచ్చాడు సియటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్. జాహ్నవిని ఢీకొట్టాడు. నిజానికి ఆ రోడ్డు 40 కిలోమీటర్ల జోన్ పరిధిలో ఉంది. కానీ పోలీస్ అధికారి మాత్రం పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో 119 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ వచ్చాడు. జాహ్నవి కందులను ఆఫీసర్ కెవిన్ డేవ్ కారు వేగంగా ఢీకొట్టింది.
దీంతో జాహ్నవి చాలా దూరం ఎగిరిపడింది. అక్కడే ప్రాణాలు వదిలింది. అయితే ఈ సమయంలో ఆఫీసర్ చేసిన కామెంట్స్ కూడా దారుణంగా ఉన్నాయి. సాధారణ వ్యక్తి మరణించిందని, ప్రాణానికి విలువ లేదని ఆఫీసర్ కెవిన్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డు అయింది. తర్వాత ఈ ఆడియో రికార్డింగ్ బయటపడిన తర్వాత నిరసనలను రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశం దర్యాప్తు కోరింది.
ఆఫీసర్ చేసిన కామెంట్స్పై అమెరికాలోనూ విమర్శలు వచ్చాయి. కెవిన్ చేసిన వ్యాఖ్యలు శాఖ ప్రతిష్టను దెబ్బతీశాయని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని అతడిని విధుల నుంచి తొలగించారు. 5,000 USD జరిమానా చెల్లించాలని ఆదేశించారు. కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్లు అతనిపై నేరారోపణలు దాఖలు చేయడానికి నిరాకరించారు. అతను జాహ్నవిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడని, భద్రతను నిర్లక్ష్యం చేశాడని నిరూపించలేకపోయారని అన్నారు.
ఇప్పుడు తాజాగా కందుల జాహ్నవి కుటుంబానికి పరిహారం చెల్లించేందుకు అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. 'జాహ్నవి కందుల మరణం హృదయ విదారకమైనది, ఈ పరిహారం కందుల కుటుంబానికి కొంత ఊరను తెస్తుందని ఆశిస్తోం. జాహ్నవి జీవితం చాలా ముఖ్యమైనది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు, మా సమాజానికి చాలా ముఖ్యమైనది.' అని ఎరికా ఎవాన్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
కందుల జాహ్నవి కుటుంబం తరపు అటార్నీ నుంచి ఈ విషయంపై ఇప్పటిదాగా స్పందన లేదు. దీనికి సంబంధించి వచ్చిన ఇమెయిల్లు లేదా ఫోన్ కాల్లకు వెంటనే స్పందించలేదు. గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు పరిష్కార నోటీసు దాఖలు చేశాయి. స్థానిక న్యూస్ వెబ్సైట్ ఈ ఒప్పందం గురించి ప్రచురించింది.

E-Paper












