ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మెుత్తం 80కిపైగా అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Published on: Jun 23, 2026, 17:34:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో దాదాపు 80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, వాటన్నింటికీ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ సమావేశంలో వ్యూహాత్మక అడుగులు పడ్డాయి.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు వీలుగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సిఫార్సు చేసిన దాదాపు రూ.34,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35,000 మంది యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమలు, సమాచార సాంకేతికత), గ్రీన్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం), డేటా సెంటర్లు, పర్యాటక రంగాల్లో ఈ పెట్టుబడులు కేంద్రీకృతం కానున్నాయి.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు క్యాబినెట్ బృహత్తర ప్రణాళికలను ఆమోదించింది. ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.426 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది.

రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ శాశ్వత భవన నిర్మాణ పనుల కోసం రూ.139 కోట్ల వ్యయ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫేజ్-1, ఫేజ్-2 పనులను వేగవంతం చేయడానికి వీలుగా సీఆర్డీఏ పరిధిలో 95 డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల తాత్కాలిక పోస్టుల మంజూరుకు ఓకే చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. వీరి పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రివర్గం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్రతిష్టాత్మక కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.

దీనితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలైన టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి క్యాబినెట్ అంగీకరించింది. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చేయనుంది. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో ఉంచేందుకు రాయలసీమ జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలలో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, కాలుష్య రహిత ఇంధనాన్ని అందించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశం.. అటు పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వరదకు, ఇటు నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More