South Central Railway Festival Trains : పండుగల సీజన్ ప్రారంభం కావడంతో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని యశ్వంత్పూర్, బీదర్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం…. యశ్వంత్పూర్ – బీదర్ – యశ్వంత్పూర్ (ట్రైన్ నంబర్లు 06589 / 06590) ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
టైమింగ్స్ వివరాలు :
- యశ్వంత్పూర్ - బీదర్ (ట్రైన్ నంబర్ 06589): ఈ ప్రత్యేక రైలు శుక్రవారం, సెప్టెంబర్ 11, 2026న యశ్వంత్పూర్ నుంచి బయలుదేరి బీదర్ చేరుకుంటుంది.
- బీదర్ - యశ్వంత్పూర్ (ట్రైన్ నంబర్ 06590): తిరుగు ప్రయాణంలో ఈ రైలు శనివారం, సెప్టెంబర్ 12, 2026న బీదర్ నుంచి బయలుదేరి యశ్వంత్పూర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ లిస్ట్…
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే సమయంలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక పరిధిలోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబుర్గి, హోమ్నాబాద్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం నిలుస్తాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో 2AC (సెకండ్ ఏసీ), 3AC (థర్డ్ ఏసీ), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు. సొంత ఊళ్లకు ప్రయాణించేవారు, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.