గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గడంతో దిగువ ప్రాంతాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఆదివారం రాత్రి నాటికి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి 14.13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కాస్త తగ్గినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు మరియు నదీ పరివాహక ప్రాంతవాసులు వరద నీరు పూర్తిగా తగ్గే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం…. ఈ రోజు ( ఆగస్టు 03) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మిగిలిన పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.