రికార్డు స్థాయిలో వేరుశనగ ధర.. క్వింటాలు గరిష్టంగా రూ.10,940!

ఏపీలో వేరుశనగ ధర రికార్డు స్థాయిలో పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Published on: Jan 25, 2026, 21:45:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లాలోని ప్రధాన పంట అయిన వేరుశనగ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు వేరుశనగ గరిష్టంగా రూ.10,940 పలికిందని, ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర అని మార్కెట్ అధికారులు తెలిపారు. వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గడం, మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్లే ఇంతటి భారీ పెరుగుదల ఉందని అధికారులు తెలిపారు. మధ్యస్థ ధర రూ.9,810, కనిష్ట ధర రూ.6000కు వ్యాపారులు కొన్నారు.

వేరుశనగ ధరలు
వేరుశనగ ధరలు

ముఖ్యంగా వేరుశనగ ప్రధాన పంటగా ఉన్న కరవు పీడిత మండలాల్లో రైతులకు ఈ పెరుగుదల పెద్ద ఉపశమనం కలిగించింది. కొన్ని రోజుల క్రితం ధరలు క్వింటాలుకు దాదాపు రూ.6,000కు పడిపోయాయి. అయితే అప్పటి నుండి ధరలు క్రమంగా పెరిగాయి. ఎమ్మిగనూరు మార్కెట్లో సగటు ధర ప్రస్తుతం క్వింటాలుకు రూ.9,810 వద్ద ఉందని అధికారులు తెలిపారు. రాకపోకలు పరిమితంగా కొనసాగి డిమాండ్ బలంగా ఉంటే రాబోయే రోజుల్లో ధరలు స్థిరంగా ఉంటాయని వ్యాపారులు భావిస్తున్నారు.

మార్కెట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ధర నమోదైంది. ఇటీవలే ఆదోని మార్కెట్‌లోనూ ధర భారీగా పలికింది. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ ప్రధాన పంట. కొన్నేళ్లుగా ధర లేక ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ఉన్నట్టుండి.. ధర పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇటీవల ఆదోని మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.9652 పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో నూనె గింజలకు డిమాండ్ పెరగడంతో కూడా వేరుశనగ పంటకు డిమాండ్ పెరిగినట్టుగా పలువురు చెబుతున్నారు.

తెలంగాణలోనూ భారీగా ధరలు

ఇటీవల పక్క రాష్ట్రం తెలంగాణలోనూ వేరుశనగ ధర భారీగా పలికింది. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్​లో వేరుశనగ ధర క్వింటాల్​కు గరిష్టంగా రూ.10,280 పలికింది. సగటున క్వింటాల్ ధర రూ.9,369 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. కల్వకుర్తి మార్కెట్‌లోనూ ఇటీవల క్వింటాల్ వేరుశనగ ధర రూ.10,200 పలికింది. వనపర్తి మార్కెట్​లోనూ రూ.10 వేలు దాటింది. నెల రోజుల సమయంలోనే క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1200 వరకు వేరుశనగ ధర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఈ స్థాయి ధరలు రైతులు చూడలేదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More