AP Heatwave Alert : ఏపీవాసులకు అలర్ట్ .. ఈ 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు…!
ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది.
ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. ఉదయం దాటితే చాలు భానుడి ప్రతాపం మొదలవుతోంది. మొన్నటి వరకు కూడా తేలికపాటి వర్షాలు కురువటంతో… కాస్త ఉపశమనం దొరికినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో… ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్ల వడగాలులు కూడా వీస్తున్నాయి.

16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు….
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం…. ఇవాళ ఏపీలోని 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు ఉన్నాయి. ఇక పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం ఉండనుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని అంచనా.
మరో 68 మండలాల్లో ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం - 7, పోలవరం - 2, ఏలూరు - 1, కృష్ణా- 5, ఎన్టీఆర్ - 9, గుంటూరు 16, బాపట్ల 1, పల్నాడు 21, ప్రకాశం జిల్లాల్లోని 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. ఆదివారం18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
శుక్రవారం నంద్యాల జిల్లాలోని గుల్లదుర్తిలో 42.1 డిగ్రీలు, కడప జిల్లాలోని కమలాపురంలో 42 డిగ్రీలు, పల్నాడు(జి) గురజాల, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 41.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లి 41.6°C, కర్నూలు(జి) తోవిలో 41.4°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఏలూరు జిల్లాలోని ధర్మాజీగూడెంలో 40.4°C, మార్కాపురం(జి) బొట్లగూడూరు 40.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె 40.1°C, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

