రాష్ట్రంలో ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. రోహిణి కార్తె ప్రవేశించిన వేళ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మే 24 (ఆదివారం) నాటి ఉష్ణోగ్రతలు ఈ సమ్మర్ సీజన్ లోనే అత్యధిక రికార్డులను నమోదు చేశాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3°C ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే విధమైన తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అప్రమత్తం చేసింది.
మే 25 (సోమవారం) ఉష్ణోగ్రతల అంచనాలు :
- 45°C నుంచి 47°C వరకు (తీవ్ర ఎండలు) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం ప్రాంతం, ఏలూరు, ఎన్టీఆర్ (విజయవాడ), కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా
- 43°C నుంచి 45°C వరకు : విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం మరియు నెల్లూరు పరిసర ప్రాంతాలు.
- 40°C నుంచి 43°C వరకు : శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Wave), మరో 166 మండలాల్లో వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. విపరీతమైన ఎండల మధ్యే ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఉపశమనం లభించనుంది. మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి మరియు మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడవచ్చు.
కీలక సూచనలు:
- బయటకు రావొద్దు : ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు, వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. బయటకు రాకపోవడం చాలా మంచిది.
- పిడుగుల పట్ల జాగ్రత్త : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో లేదా ఐరన్ హోర్డింగ్స్ కింద నిలబడకూడదు.
- ఆరోగ్య జాగ్రత్తలు : వడదెబ్బ తగలకుండా తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం లేదా నిమ్మరసం నిరంతరం తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.