హీట్ వేవ్ అలర్ట్.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట స్థానికంగా సెలవుల ప్రకటన
హీట్ వేవ్పై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట స్థానికంగా సెలవుల ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు.

ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అవసరం అయితే స్థానికంగా సెలవులు ఇచ్చి.. జాగ్రత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వడగాలుల నుంచి ఎలా రక్షించు కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు.
ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1349 హీట్ షెల్టర్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలియచేశారు. మరోవైపు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగు నీటి కొరత రాకుండా చూడాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 2015లో బలమైన ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో 50.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని.. ఈ ఏడాదిలోనూ ఎల్ నినో ప్రభావంతో ఇప్పటి వరకూ 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదు అయినట్టు అధికారులు వివరించారు.
గడచిన మూడు రోజులుగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. భూగర్భ జలాలు పెరిగితే... పచ్చదనం పెరుగుతుందని... తద్వారా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి కొంత మేర ఉపశమన లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అన్నమయ్య జిల్లానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని స్పష్టం చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో హెచ్చరికలు, అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సమాచారం చేరవేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


