తిరుమల శ్రీవారికి భారీ విరాళం - బర్డ్ ట్రస్టుకు రూ. 4.41 కోట్లు అందజేసిన హైదరాబాద్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ సంస్థ అయిన బర్డ్ ట్రస్ట్కు భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.4.41 కోట్ల భారీ విరాళాన్ని అందజేసింది.
TTD BIRRD Trust Donation : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి చెంత మరో భారీ విరాళం నమోదైంది. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ…. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్ (BIRRD) ట్రస్ట్కు రూ.4.41 కోట్ల విరాళాన్ని సోమవారం అందజేసింది.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, సంస్థ డైరెక్టర్లు ఎస్. రాజమౌళి, టి. ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందజేశారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ డీడీలను స్వీకరించారు. దాతల సేవా నిరతిని కొనియాడిన బోర్డు చైర్మన్, వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం కల్పించారు.
పేదలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో టీటీడీ ఈ బర్డ్ ట్రస్టును నిర్వహిస్తోంది. ముఖ్యంగా వికలాంగులకు, ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఇక్కడ నిపుణులైన వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తారు. ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీతో పాటు పునరావాస సేవలను కూడా అందిస్తారు.
ఆర్ఎస్ బ్రదర్స్ అందించిన ఈ విరాళం బర్డ్ ఆసుపత్రిలోని వైద్య సదుపాయాల విస్తరణకు, పేద రోగుల చికిత్సకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తమ వంతు మద్దతును ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.
టీటీడీ ఎస్వీ గోశాలకు గుర్రం విరాళం:
మరోవైపు మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం…. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు.
సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలియజేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

