IBPS Clerk Recruitment : ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి.. ఏపీలో 186, తెలంగాణలో 191
IBPS Clerk Recruitment : ఐబీపీఎస్ ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఆగస్టు 28 చివరితేదీగా నిర్ణయించారు.
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 2027-28 సంవత్సరానికి గాను మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11,403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇందులో గణనీయంగా పోస్టులు కేటాయించారు.ఆంధ్రప్రదేశ్: 186 పోస్టులు, తెలంగాణ: 191 పోస్టులు ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ (1,731), కర్ణాటక (1,414), మహారాష్ట్ర (1,051), పశ్చిమ బెంగాల్ (946), గుజరాత్ (698), తమిళనాడు (675), మధ్యప్రదేశ్ (570), దిల్లీ (415), కేరళ (108), గోవా (61).
ఈ పోస్టులకు అప్లై చేసేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2026 ఆగస్టు 21 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష (తెలుగు) రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
2026 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నెలకు ప్రాథమిక వేతనం రూ.24,050 నుంచి రూ.64,480 వరకు ఉంటుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు అందుతాయి. అభ్యర్థులను ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష, మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LLPT), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్షలో 100 మార్కులకు (100 ప్రశ్నలు) 60 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇంగ్లీష్ (30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్ పరీక్షలో 200 మార్కులకు (160 ప్రశ్నలు) 125 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి.ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ప్రతీ తప్పు సమాధానానికి 0.25 (1/4) మార్కుల కోత ఉంటుంది. 10వ తరగతి లేదా అంతకంటే పైచదువుల్లో స్థానిక భాషను ఒక పాఠ్యాంశంగా చదివిన వారికి ఎల్ఎల్పీటీ నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు రూ. 175, ఇతరులందరికీ: రూ. 850గా ఉంది. దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ 28.08.2026గా ఉంది. ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 10, 11, ప్రిలిమ్స్ ఫలితాలు నవంబర్ 2026లో వెలువడుతాయి. ఇక మెయిన్స్ పరీక్ష 2026 డిసెంబర్ 27న ఉంటుంది. అభ్యర్థుల తుది ఎంపికను మార్చి 2027న ప్రకటిస్తారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం IBPS అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


