రాబోయే నాలుగైదు రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగైదు రోజులు వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Published on: Jun 22, 2026, 20:08:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, దానికి తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ముందస్తు జాగ్రత్తలు జారీ చేశారు.

తెలంగాణ, ఏపీ వర్షాలు
తెలంగాణ, ఏపీ వర్షాలు

వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం వేగంగా మారుతోంది. రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది.

APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆరెంజ్ అలర్ట్ ప్రధానంగా కొన్ని జిల్లాలకు వర్తిస్తుంది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ప్రజలకు అధికారుల కీలక సూచనలు

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పిడుగుపాట్లు, బలమైన గాలుల నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More