IMD Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Published on: Jun 28, 2026, 16:30:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండగా.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఎండ తీవ్రత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

తెలంగాణ, ఏపీ వర్షాలు
తెలంగాణ, ఏపీ వర్షాలు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదిలిపోతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలు కురవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురవనున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించనుంది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. దక్షిమ కోస్తా, రాయలసీమలో ఈ ప్రభావం ఉండనుంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు అత్యంత చురుగ్గా మారాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జూన్ 28 నుండి జూలై 2 వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లోనూ వానలు పడనున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఐఎండీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. యూపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ఇక్కడికి చేరుకోవడం గమనార్హం. గత 16 రోజులుగా రుతుపవనాల కదలికల్లో స్తబ్దత ఏర్పడి, బిహార్ సరిహద్దుల వద్దే నిలిచిపోయాయి.

దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గోవా, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎండీ వీటికి కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

అదే సమయంలో.. రాజస్థాన్ సహా ఏడు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు తీవ్రమైన వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More