...
...
Next Story

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం... ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు - వాతావరణశాఖ

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు ఎండలు ఉండగా… మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

Published on: May 09, 2026 07:00 AM IST
Advertisement

AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా….. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ద్రోణి ప్రభావంతో వర్షాలు….

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

వాతావరణశాఖ అంచనాల ప్రకారం….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ద్రోణి ప్రభావంతో రానున్న మంగళవారం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఫలితంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలోని దాదాపు అన్ని ప్రధాన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ జాబితాలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అనేక జిల్లాలు ఉన్నాయి.

  • ఉత్తర కోస్తా: అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు.
  • మధ్య కోస్తా: కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు.
  • దక్షిణ కోస్తా - రాయలసీమ: ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలు.

“ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు” అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వల్ల పిడుగుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని… సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని సూచించింది.

అల్లూరి జిల్లా పరిధిలోని జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, చింతూరు, మారేడుమిల్లి, గుర్తేడు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం (అర్బన్ - రూరల్), రాజానగరం, గోకవరం, కోరుకొండ. కోనసీమతో పాటు ఏలూరు జిల్లాల్లోని ఆత్రేయపురం, వేలేరుపాడు మండలాల్లోనూ వేడి గాలులు తీవ్రంగా ఉండే సూచనలున్నాయి.

తెలంగాణకు వర్ష సూచన:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలకు ఉపశమనం లభించనుంది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) బులెటిన్ విడుదల చేసింది.

ఇవాళ(మే 9) తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మే 10వ తేదీన రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక మే 11వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe