Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు 60 అదనపు రైలు సర్వీసులు

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు 60 అదనపు రైలు సర్వీసులు నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

Published on: Aug 25, 2026, 15:49:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం దాదాపు 60 అదనపు రైలు సర్వీసులను నడపాలని రైల్వే అధికారులు యోచిస్తున్నట్లు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిషోర్, రాహుల్ మీనా కలిసి, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా జనసందోహాన్ని నిర్వహించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై సమీక్ష నిర్వహించారు.

గోదావరి పుష్కరాలకు అదనపు రైళ్లు
గోదావరి పుష్కరాలకు అదనపు రైళ్లు

భక్తుల నిర్వహణ కోసం రైల్వే, ఏపీఎస్ఆర్టీసీ, పోలీసు, ఇతర సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరిపి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా అదనపు రైళ్లను నడపనున్నారు. గోదావరి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లతో సహా అన్ని స్టేషన్ల వద్ద రూట్ మ్యాప్‌లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అలాగే భక్తులకు మార్గనిర్దేశం చేసే నడక మార్గాలపై నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి పోలీసు, రవాణా శాఖలను ఆదేశించారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను, పుష్కరం కంట్రోల్ రూమ్‌లు, రైల్వే అధికారుల వ్యవస్థలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పనుల పరిశీలన

నిడదవోలు నియోజకవర్గంలోని చినకాశీరేవును సందర్శించి గోదావరి పుష్కరాలు 2027 దృష్ట్యా చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చినకాశీరేవులో అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

చినకాశీరేవు వద్ద రూ.30 లక్షల వ్యయంతో భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు స్నానాలకు షవర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.1.25 కోట్లతో పిండ ప్రదాన షెడ్ల నిర్మాణం, ఘాట్ల ఆధునికీకరణ, రూ.30 లక్షలతో ఫ్లోరింగ్, రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధి వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు. అలాగే భక్తులు, పర్యాటకుల రాకపోకలకు మరింత సౌకర్యంగా ఉండేలా రూ.4.47 కోట్ల రైల్వే నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.

చినకాశీరేవులో ఆధ్యాత్మికతకు పర్యాటక వైభవాన్ని జోడించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా శాస్కి స్కీమ్‌లో భాగంగా చినకాశీరేవులోని మూడు ఘాట్ల వద్ద రూ.24 లక్షల వ్యయంతో దివ్యమైన ‘గోదావరి హారతి’ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా గోదావరి తీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చినకాశీరేవులోని పలు దేవాలయాలను ఆధునికీకరించి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పుష్కరాల నాటికి అవసరమైన అన్ని పనులను సమన్వయంతో పూర్తి చేసి, చినకాశీరేవును దివ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More