రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు - జనసేన కీలక నిర్ణయం
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ స్పందించింది. లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణ చేయాలని నిర్ణయించింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినాయకత్వం స్పందించింది. ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. టి.శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ని సభ్యులుగా ప్రకటించింది.

ఎమ్మెల్యేపై వచ్చిన వార్తలపై విచారణ చేయాలని కమిటీని జనసేన పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.
అసలేం జరిగిందంటే…?
రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపునఅరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కూడా ఉన్నారు. అయితే ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆన్లైన్లో విడుదలైన వీడియో స్టేట్మెంట్లో ఒక మహిళ చేసిన ఆరోపణల ప్రకారం…. ఎమ్మెల్యే దాదాపు ఏడాదిన్నరగా తనపై లైంగికంగా దాడి చేశాడని ఉంది. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఛాయాచిత్రాలు, వాట్సాప్ చాట్లు, రీల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయ్యాయి.
ఎమ్మెల్యే అయిన తర్వాత శ్రీధర్ మొదట ఫేస్బుక్ ద్వారా తనను సంప్రదించాడని, ఆ తర్వాత తనకు లొంగిపోవాలని బెదిరించాడని ఆ మహిళ తన వీడియో స్టేట్మెంట్లో పేర్కొంది. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఫలితంగా తాను గర్భవతి అయ్యానని ఆ మహిళ తెలిపింది.
తన ఇష్టానికి విరుద్ధంగా గర్భస్రావం చేయించుకోవలసి వచ్చిందని ఆ మహిళ ఆరోపించింది. శ్రీధర్ తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని చెప్పింది. తన భర్త నుండి విడిగా నివసిస్తున్నానని, విడాకులు తీసుకోవాలని ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.
తన డిమాండ్లను పాటించకపోతే మూడేళ్ల కొడుకును చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని.. బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని కూడా ఆ మహిళ ఆరోపించింది.
ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారంపై పలు పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సదరు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఆరోపణలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

E-Paper












