శబరిమల: మకరజ్యోతి దర్శనానికి వెళ్తున్నారా....? ఈ నిబంధనలను తప్పక తెలుసుకోండి

మకర సంక్రాంతి వేళ శబరిమలలో ‘మకర జ్యోతి’గా దర్శనమిచ్చే పవిత్ర సమయం దగ్గరపడింది. అయితే ఈసారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శబరిమలకు వచ్చే భక్తులకు పలు సూచనలు చేశారు.

Published on: Jan 14, 2026 7:44 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. అయితే సంక్రాంతి రోజున ‘మకర జ్యోతి’ని(మకరవిలక్కు) వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. ఆ రోజున సాయంత్రం కనిపించే మకరజ్యోతిని చూశాకే అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శబరిమల ఆలయం (image source @airnews_tvm)
శబరిమల ఆలయం (image source @airnews_tvm)

శబరిమలలో మకరవిలక్కు పండగ( మకర జ్యోతి దర్శనం) సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని… సమూహ నియంత్రణకు పోలీసులు పలు మార్గదర్శకాలను ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్ధవంతమైన విధంగా స్పందించడానికి ఆంక్షలు, నిబంధనలు కఠినంగా అమలు చేయబడతాయని స్పష్టం చేశారు. ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డుతో పాటు ఇతర సంబంధిత విభాగాలు సంయుక్తంగా ఏర్పాట్లను అమలు చేస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యమైన నిబంధనలు:

  • 14.01.2026 తేదీ నాటి (మకరవిలక్కు రోజున) వర్చువల్ క్యూ బుకింగ్ 30,000 మంది భక్తులకే పరిమితం చేయబడింది.
  • చెల్లుబాటయ్యే వర్చువల్ క్యూ బుకింగ్‌ లేని భక్తులకు దర్శనానికి అనుమతి ఉండదు.
  • భక్తులు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ముందు చెల్లుబాటయ్యే వర్చువల్ క్యూ బుకింగ్‌ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
  • ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, తమకు కేటాయించబడిన వర్చువల్ క్యూ టైమ్ స్లాట్‌కి అనుగుణంగా ప్రయాణ ప్రణాళికలు వేసుకోవాలి.
  • 14.01.2026న 09:00 గం.ల తర్వాత నీలక్కల్ నుంచి పంప వరకు యాత్రికులు ప్రయాణించడానికి అనుమతించబడదు.
  • 14.01.2026న 10:00 గం.ల తర్వాత పంప నుంచి సన్నిధానానికి ట్రెక్కింగ్ ప్రారంభించడానికి అనుమతించబడదు.

పైన పేర్కొన్న నిబంధనలను తప్పక పాటించాలని కేరళ పోలీసులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, క్రమపద్ధతిలో దర్శనానికి వీలు కల్పించే విధంగా నీలక్కల్ మరియు పంప సహా అన్ని పాయింట్లలోను ప్రవేశం మరియు తదుపరి ప్రయాణాలు కఠినంగా నియంత్రించబడతాయని స్పష్టం చేస్తున్నారు.

మకరజ్యోతి దర్శనానంతరం పంబ వైపు వెళ్లేందుకు హడావిడి పడరాదని భక్తులకు సూచించారు. యాత్రికులను దశలవారీగా, పద్ధతి ప్రకారం చేరవేసేందుకు తగిన సంఖ్యలో కేఎస్ఆర్‌టీసీ బస్సులు ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు.

పోలీసుల సూచనలు, బ్యారికేడ్ ఏర్పాట్లు, దశలవారీ కదలిక ప్రణాళికలను కచ్చితంగా అనుసరించాలని యాత్రికులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసరంగా హడావిడి పడటం వల్ల జన సామర్థ్యం అతిగా పెరిగిపోయి… తొక్కిసలాటలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చని హెచ్చరించారు. మకరవిలక్కు తీర్థయాత్ర సురక్షితంగా…. ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు భక్తులందరు సహకరించాలని కోరారు.