...
...
Next Story

May 28th Weather : 100కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలులు.. శుక్రవారం పరిస్థితి ఇలా!

అధిక వేడితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు బుధవారం కాస్త ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారంనాడు మాత్రం కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

Published on: May 28, 2026, 09:20:41 IST
Advertisement

దాదాపు ఒక వారం పాటు 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అల్లాడిపోయిన తర్వాత.. బుధవారం (మే 27) నాడు వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలకు ఉపశమనాన్ని కల్పించాయి. ఒక వారం కంటే ఎక్కువ కాలం తర్వాత.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో రికార్డయింది. మే 18 నుండి, ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా 44 డిగ్రీల కంటే పైనే నమోదవుతూ వచ్చాయి.

వెదర్ అప్డేట్
వెదర్ అప్డేట్

గత వారం రోజులుగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు వరుసగా చూసుకుంటే.. మే 18న 44.3 డిగ్రీలు, మే 19న 45.6 డిగ్రీలు, మే 20న 47.6 డిగ్రీలు, మే 21న 48.1 డిగ్రీలు, మే 22న 44.8 డిగ్రీలు, మే 23న 45.8 డిగ్రీలు, మే 24న 48.3 డిగ్రీలు, మే 25న 48.1 డిగ్రీలు, మే 26న 47.7 డిగ్రీలుగా ఉన్నాయి.

బుధవారం నాడు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా వడగాలులు లేదా తీవ్ర వడగాలుల పరిస్థితులు లేవు. శ్రీకాకుళం జిల్లాలో రెండు మండలాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు, మరో 11 మండలాల్లో సాధారణ వడగాలుల పరిస్థితులు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు, మరో రెండు మండలాల్లో సాధారణ వడగాలుల పరిస్థితులు ఉన్నాయి.

ఇక గురువారం(మే 28) నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 100కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించాయి. శుక్రవారం నాడు కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. ఐఎమ్‌డి ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe