రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం(జనవరి 2) నుంచి ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి… రైతులకు నూతన పాస్ బుక్ లను పంపిణీ చేస్తారు.
బొమ్మలు లేకుండానే…!

గతంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫొటోలున్నాయి. అయితే తాజాగా ఇవ్వబోయే పట్టాదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫొటోలు ఉండవు. కేవలం రాజముద్ర, క్యూఆర్ కోడ్తో కొత్త పుస్తకాలను మాత్రమే పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో…. మొత్తం 21.80 లక్షల పుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది.
గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు(పీపీబీ) పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. వీటిపై ఎవరూ ఫొటోలు ఉండవు. ఇప్పటికే ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్పుస్తకాల్ని రైతులకు అందజేయనుంది.
పట్టాదారు పుస్తకంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని రెవెన్యూశాఖ అధికారులకు స్పష్టం చేసింది. అందజేయకముందే తప్పులు సరిచూసుకోవాలని సూచించింది. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలని సూచించింది. పంపిణీ ప్రక్రియ వీఆర్వో ఆన్లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. కొత్తవి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పాత భూహక్కు పత్రాలు(బీహెచ్పీ) వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ ఆదేశించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రీసర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. అంతేకాకుండా గతంలో ఉన్న పాసు పుస్తకాలను కూడా రద్దు చేయగా…. కొత్త వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తూ వస్తోంది. ఇప్పటికే రీసర్వే పూర్తి అయిన భూములకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయనుంది.